ముంబై: ఐపీఎల్లో తనకు గాయం కావడం దురదృష్టమని భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు. దీనికోసం మరోసారి బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసం కోసం వెళ్తున్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆడిన రహానే కండరాల గాయంతో టోర్నీ నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 133 పరుగులు చేశాడు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న రహానే మీడియాతో మాట్లాడాడు. ‘ఆ గాయం కావడం నా దురదృష్టం. కానీ దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.
పది రోజుల పాటు బెంగళూరులో పునరావాసంలో ఉన్నా. ఇప్పుడు మరికొన్నాళ్లు ఎన్సీఏకు వెళ్తున్నా. ప్రస్తుతం నా దృష్టంతా వేగంగా కోలుకోవడంపైనే ఉంది. వీలైనంత త్వరగా ఫిట్నెస్ సాధించి మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాలని అనుకుంటున్నా. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. కోల్కతాతో నా అనుబంధం బాగుంది. కేకేఆర్ తరఫున ఆడడం నిజంగా ఎంతో సంతోషానిచ్చింది. అక్కడి పరిస్థితులు చాలా బాగుంటాయి. ఒక కుటుంబ వాతావరణంలా ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయాం. కోల్కతా యాజమాన్యం పూర్తి స్వేచ్ఛనివ్వడం మాత్రం నాకు చాలా ప్రత్యేకం. బ్రెండన్ మెకల్లమ్ నుంచి ఎన్నో నేర్చుకున్నా’అని రహానే తెలిపాడు.