అహ్మదాబాద్: హిట్మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా మైదానంలో చెమటోడుస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం తొలి పోరులో వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనున్న భారత జట్టు.. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నది. క్వారంటైన్ ముగిసిన అనంతరం గురువారం ఒక సెషన్ పాటు ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు.. శుక్రవారం రోజంతా నరేంద్రమోదీ మైదానంలో గడిపారు. కొత్తగా జట్టుకు ఎంపికైన యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ను కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లందరికీ పరిచయం చేయగా.. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ గంటల తరబడి నెట్స్లో బంతులిసిరారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవాలు ఎదుర్కొన్న టీమ్ఇండియా.. స్వదేశంలో కరీబియన్లను చిత్తు చేయాలని భావిస్తుంటే.. ఇంగ్లండ్పై టీ20 సిరీస్ గెలిచి వచ్చిన విండీస్ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు కరోనా రూపంలో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ ముగ్గురితో పాటు నెట్ బౌలర్ నవ్దీప్ సైనీ సహాయక బృందంలో మరో ముగ్గురికి కరోనా సోకడంతో వారంతా ఐసొలేషన్లో ఉన్నారు.
సిరాజ్కే చాన్స్
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ నెట్స్లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ కొనసాగించగా.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ ద్రవిడ్తో చర్చిస్తూ కనిపించాడు. కుల్చా జోడీతో పాటు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కోహ్లీ, పంత్ ప్రాక్టీస్ సాగించారు. వన్డే జట్టుకు ఎంపికైన మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం క్వారంటైన్లో ఉండగా.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. సాధన ముగిసేంత వరకు అక్కడే ఉండి ఒక్కొక్కరిని పరిశీలించిన ద్రవిడ్.. ఆ తర్వాత వారికి తగిన సూచనలిచ్చాడు. భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఆదివారం మ్యాచ్.. టీమ్ఇండియాకు 1000వది కావడంతో ఈ మ్యాచ్పై మరింత ఆసక్తి పెరిగింది.