తొలి రెండు మ్యాచ్ల్లో పేలవ ఆటతీరుతో పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. ఉప్పల్ వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో సన్రైజర్స్ను చిత్తుచేసిన
రోహిత్ సేన హ్యాట్రిక్ విజయం మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్లో గ్రీన్తో పాటు తిలక్వర్మ, ఇషాన్ కిషన్
రాణించడంతో భారీ స్కోరు చేసిన ముంబై.. ఆనక బౌలింగ్లోనూ సత్తాచాటింది. గత రెండు మ్యాచ్ల్లో చక్కటి విజయాలతో గాడినపడ్డ హైదరాబాద్.. ఈసారి భారీ లక్ష్యఛేదనలో తడబడి 14 పరుగుల తేడాతో మూడో పరాజయం మూటగట్టుకుంది.
ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో మూడో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై 14 పరుగుల తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు), ఇషాన్ కిషన్ (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టారు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్ (9)తో పాటు రాహుల్ త్రిపాఠి (7), అభిషేక్ శర్మ (1) విఫలం కాగా.. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు, ఒక సిక్సర్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో బెహ్రన్డార్ఫ్, మెరిడిత్, పియూష్ చావ్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. గ్రీన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో రాజస్థాన్ రాయల్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
తలా కొన్ని..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రోహిత్ సేనకు శుభారంభం లభించింది. సుందర్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోగా.. నటరాజ్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి వెనుదిరిగాడు. మరో ఎండ్లో ఇషాన్ కిషన్ ధాటిగా ఆటంతో పవర్ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి ముంబై 53/1తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగానికి బ్రేక్లు పడగా.. జాన్సెన్ ఓకే ఓవర్లో ఇషాన్తో పాటు సూర్యకుమార్ (7)ను ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన లోకల్ బాయ్ తిలక్ వర్మ ఉప్పల్ స్టేడియాన్ని ఊపేశాడు.
తిలక్ తడాఖా..
హైదరాబాద్లో పుట్టి పెరిగిన తిలక్ వర్మ.. సొంతగడ్డపై ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్లో దుమ్మురేపాడు. గత సీజన్లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచిన తిలక్.. ఈ సీజన్లో అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే తన క్లాస్ ఏంటో ప్రపంచానికి చాటుకున్న ఈ తెలంగాణ యువకెరటం.. ఉప్పల్లో ఊర మాస్ ఇన్నింగ్స్తో అలరించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా.. స్టేడియం మొత్తం తిలక్ దంచుడును ఎంజాయ్ చేసింది. మార్కండే ఓవర్లో ఫోర్తో మొదలైన అతడి విధ్వంసం.. జాన్సెన్ ఓవర్లో రెండు సిక్సర్లతో మరో స్థాయికి చేరింది. మరో రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన తిలక్.. భువనేశ్వర్ ఓవర్లో మరో భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. తనను భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణం అని ఎందుకు అంటున్నారో ఈ ఇన్నింగ్స్తో తిలక్ మరోసారి నిరూపించాడు.
పోరాడినా ప్చ్..
భారీ లక్ష్యఛేదనలో సన్రైజర్స్కు శుభారంభం దక్కలేదు. హ్యారీ బ్రూక్ రెండో ఓవర్లోనే వెనుదిరగగా.. మయాంక్ అగర్వాల్ వన్డే తరహా ఆటతో విసిగించాడు. కెప్టెన్ మార్క్మ్ (22) కాసేపు నిలువగా.. అభిషేక్ శర్మ (1) విఫలమయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 76/4తో నిలిచింది. అయితే మిడిల్ ఓవర్స్లో హెన్రిచ్ క్లాసెన్ భారీ షాట్లతో విరుచుకుపడి హైదరాబాద్ అభిమానుల్లో జోష్ నింపాడు. రైజర్స్ విజయానికి 5 ఓవర్లలో 60 పరుగులు అవసరమైన దశలో జాన్సెన్ (13) మూడు ఫోర్లు బాది ఔట్ కాగా.. సుందర్ (10) కొన్ని షాట్లు ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్.. భువనేశ్వర్ కుమార్(2)ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
38,411 మంది ప్రేక్షకులు హైదరాబాద్, ముంబైకి విచ్చేశారు. ఉప్పల్ స్టేడియం చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం
15 ఐపీఎల్ మొదలై మంగళవారం నాటికి సరిగ్గా 15 ఏండ్లు అవుతున్నది. 2008 ఏప్రిల్ 18న పురుడు
పోసుకున్న ఐపీఎల్ ప్రపంచంలోనే ఖరీదైన లీగ్గా కొనసాగుతున్నది.
3 ఐపీఎల్లో 6000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో భారత క్రికెటర్గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్శర్మ నిలిచాడు. ధవన్, కోహ్లీ ముందు వరుసలో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 192/5 (గ్రీన్ 64 నాటౌట్, ఇషాన్ 38; మార్కో జాన్సెన్ 2/43, భువనేశ్వర్ 1/31),
హైదరాబాద్: 19.5 ఓవర్లలో 178 ఆలౌట్ (మయాంక్ అగర్వాల్ 48; క్లాసెన్ 36; మెరిడిత్ 2/33, బెహ్రన్డార్ఫ్ 2/37).