చెన్నై: ప్రత్యర్థి మారినా.. సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. బ్యాటింగ్లో అదే తడబాటును కొనసాగించిన ఆ జట్టు వరుసగా మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 14వ సీజన్లో సన్రైజర్స్ హ్యాట్రిక్ ఓటమి నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 151 పరుగుల ఛేదనలో సన్రైజర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బెయిర్స్టో(43: 22 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు), డేవిడ్ వార్నర్(36: 34 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినా ఓటమి తప్పలేదు. విజయ్ శంకర్(28) కాసేపు పోరాడాడు. విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ చెరో మూడు వికెట్లు తీశారు.
అంతకుముందు ఓపెనర్లు క్వింటన్ డికాక్(40: 39 బంతుల్లో 5ఫోర్లు), రోహిత్ శర్మ(32: 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో హార్డ్హిట్టర్ కీరన్ పొలార్డ్(35 నాటౌట్: 22బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) చెలరేగడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, ముజీబ్ రెహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.