ముంబై: జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ జయవర్దనే పేర్కొన్నాడు. లక్నో చేతిలో ఓటమి అనంతరం జయవర్దనే మీడియాతో మాట్లాడాడు. వరుస ఓటములతో జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు శ్రీలంక మాజీ కెప్టెన్ ఇలా స్పందించాడు.
‘మంచి ప్రశ్న అడిగారు. వరుస ఓటములపై మేం సమీక్షించుకోవాలి. ఇతర కోచ్లతో చర్చించి మెరుగైన ప్రణాళిక రూపొందించుకుంటాం. మొదట బ్యాటింగ్ చేస్తున్నా.. ఛేజింగ్ చేస్తున్నా మా బ్యాటింగ్లో నిలకడ లేదు. అందుకే మా ఆందోళన. మా బ్యాటింగ్ లైనప్లోని సీనియర్ గ్రూప్ గతంలో పరిస్థితులను అర్థం చేసుకుని మంచి ప్రదర్శన చేసింది. ఇప్పటివరకు జట్టులో అంతగా మార్పులు చేయలేదు. జట్టు పరంగా కొన్ని మార్పులైతే జరుగాలి. వాటిని మేం చేస్తాం. పూర్తి స్వేచ్ఛనిచ్చినా ఇషాన్ కిషన్ ఆడడంలో ఇబ్బందులు పడుతున్నాడు. ఇంతవరకు అతడితో మాట్లాడలేదు. త్వరలోనే మాట్లాడుతా’ అని తెలిపాడు.