IPL | జైపూర్: ఐపీఎల్-18లో వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి సత్తాచాటింది. గురువారం జైపూర్లోని సవాయ్మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను 117 పరుగుల తేడాతో ఓడించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో మొదట బ్యాట్తో ఆ తర్వాత బంతితోనూ రాణించిన ముంబైకి ఈ సీజన్లో ఇది వరుసగా ఆరో విజయం. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో రాజస్థాన్ సమిష్టిగా విఫలమై ఆడిన 11 మ్యాచ్లకు గాను ఎనిమిదింటిలో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. రికెల్టన్ (38 బంతుల్లో 61, 7 ఫోర్లు, 3 సిక్స్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53, 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 217/2 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కర్ణ్శర్మ(3/23), బౌల్ట్(3/28), బుమ్రా (2/15) రాయల్స్ను కుప్పకూల్చారు. లీగ్లో 8వ ఓటమితో రాజస్థాన్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా, ముంబై టాప్లోకి దూసుకొచ్చింది.
ఛేదనలో రాజస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ఆటుపోట్లకు గురైంది. ముంబై పేసర్ల జోరుతో రాయల్స్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. టాపార్డర్తో పాటు మిడిలార్డర్లో ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా కనీసం 15 బంతులను ఎదుర్కోకుండానే పెవిలియన్కు క్యూ కట్టారు. గత మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ.. దీపక్ చాహర్ తొలి ఓవర్ నాలుగో బంతికి విల్ జాక్స్కు క్యాచ్ ఇవ్వడంతో రాయల్స్ వికెట్ల పతనం మొదలైంది. బౌల్ట్ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టిన జైస్వాల్ (13).. నాలుగో బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు.
బౌల్ట్ తన తర్వాతి ఓవర్లో నితీశ్ రాణా (9)నూ పెవిలియన్కు పంపాడు. బుమ్రా తాను వేసిన తొలి ఓవర్లోనే పరాగ్ (16), హెట్మెయర్ను ఔట్ చేసి రాయల్స్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన శుభమ్ (15)ను హార్దిక్ ఔట్ చేశాడు. జురెల్ (11) కూడా వారినే అనుసరించాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన కర్ణ్శర్మ..జురెల్తో పాటు తీక్షణ(2), కార్తీకేయ(2)ను ఔట్ చేసి ముంబై గెలుపులో కీలకమయ్యాడు.
ముంబై ఇన్నింగ్స్లో టాప్-4 బ్యాటర్లు దుమ్మురేపడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. 11 ఓవర్ల పాటు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ దంచితే.. ఆ తర్వాత సూర్య, హార్దిక్ వంతు. తొలి మూడు ఓవర్లలో ముంబై 18 పరుగులే చేసినా తర్వాత గేర్ మార్చింది. ఫరూఖీ బౌలింగ్లో 6, 4 బాదిన రికెల్టన్.. ఆర్చర్ ఓవర్లోనూ 4, 6 దంచి ముంబై ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. తీక్షణ బౌలింగ్లో రోహిత్ రెండు బౌండరీలు కొట్టాడు. కార్తికేయ ఓవర్లో సిక్సర్తో రికెల్టన్ అర్ధ శతకం పూర్తయింది. తీక్షణ 12వ ఓవర్లో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించిన హిట్మ్యాన్..
ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీని నమోదుచేశాడు. ఐదు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ నిష్క్రమించడంతో 116 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ వీరి స్థానాల్లో వచ్చిన సూర్య, హార్దిక్.. రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీ బాదిన సూర్య.. ఫరూఖీ ఓవర్లో రెండు ఫోర్లు రాబట్టాడు. అతడే వేసిన 18వ ఓవర్లో హార్దిక్.. 4, 6, 4, 4తో 21 పరుగులొచ్చాయి. హార్దిక్-సూర్య అజేయమైన మూడో వికెట్కు 94 రన్స్ జోడించారు. చివరి ఐదు ఓవర్లలో ఈ ద్వయం 71 పరుగులు పిండుకుంది.
ముంబై: 20 ఓవర్లలో 217/2 (రికెల్టన్ 61, రోహిత్ 53, పరాగ్ 1/12, తీక్షణ 1/47);
రాజస్థాన్:16.1 ఓవర్లలో 117 ఆలౌట్(ఆర్చర్ 30, పరాగ్ 16, కర్ణ్శర్మ 3/23, బౌల్ట్ 3/28)