MI vs RCB : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాటర్లు చేతులెత్తేశారు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (24) మరోసారి నిరాశ పరిచింది. రీచా ఘోష్(29), అలిసా పెర్రీ (29) మాత్రమే రాణించారు.
ముంబై బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. చివర్లో రీచా ఘోష్ ధాటిగా ఆడడంతో ఆర్సీబీ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ బ్రంట్, ఇసీ వాంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్కు ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. గత మ్యాచ్లో చెలరేగి ఆడిన ఓపెనర్ సోఫీ డెవినే (0) ఖాతా తెరవకుండానే రనౌట్ అయింది. ఆ తర్వాత నిదానంగా ఆడిన మంధాన (24) భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆమె 33 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. హీథర్ నైట్(12)ను అమేలియా కేర్ ఔట్ చేసింది. అలిసా పెర్రీతో కలిసి ధాటిగా ఆడుతున్న కనికా ఆహుజా(12)ను యస్తిక స్టంపౌట్ చేసింది. ఆఖర్లో రీచా ఘోష్ ధాటిగా ఆడి స్కోర్ బోర్డును వంద దాటించింది.