Mukesh Kumar : వెస్టిండీస్ పర్యటన(West Indies Tour) యంగ్ పేసర్ ముఖేశ్ కుమార్(Mukesh Kumar)కు బాగా అచ్చొచ్చింది. ఈ 29 ఏండ్ల బెంగాల్ పేసర్ విండీస్ టూర్లో మూడు ఫార్మాట్ల(Three Farmats)లో అరంగేట్రం చేశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఎడమ చేతివాటం పేసర్ టి నటరాజన్ (T Natarajan) 2021లో మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను టెస్టు, వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ లీగ్స్తో పాటు ఐపీఎల్ పదహారో సీజన్లో రాణించిన ముకేశ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు.
విండీస్ టూర్లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్(Port Of Spain) వేదికగా జరిగిన రెండో టెస్టుతో ముఖేశ్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రంలోనే రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి వికెట్ తీశాక విరాట్ కోహ్లీ(Virat Kohli) తనను హత్తుకొని అభినందించిన క్షణాలను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్న ముఖేశ్ ఆతర్వాత వన్డేల్లోనూ ఆకట్టుకున్నాడు. మహమ్మద్ సిరాజ్(Mohammad Siraz)కు విశ్రాంతి ఇవ్వడంతో జట్టులో చోటు దక్కించుకున్న ముఖేశ్ మూడు మ్యాచ్ల్లోనూ రాణించాడు.
ముఖేశ్ కుమార్
సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో ముఖేశ్ చెలరేగిపోయాడు. పేస్కు తోడు అదనపు బౌన్స్ను వినియోగించుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. టాపార్డర్లో మూడు వికెట్లు తీసి కరీబియన్లను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో భారీ ఛేదనలో విండీస్ 200 పరుగుల తేడాతో ఓడి, సిరీస్ కోల్పోయింది. గురువారం టరోబా వేదికగా జరుగుతున్న మొదటి టీ20లోనూ ముఖేశ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.