ముంబై: ఇండియన్ క్రికెట్ టీమ్కు ఎంపిక కావాలంటే చాలా చాలా కష్టం. కానీ ఆ టీమ్ను ఎంపిక చేయడం ఇంకా కష్టం. అందుకే తరచూ సెలక్షన్ కమిటీ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. దీనికి మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా అతీతం కాదు. టీమ్ ఎంపిక వివాదాలతోపాటు ఇతర విషయాల్లోనూ ఎమ్మెస్కే విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 2019 వరల్డ్కప్ సందర్భంగా ఓ మ్యాచ్ చూడటానికి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు ఎమ్మెస్కే ప్రసాద్ టీ సర్వ్ చేస్తూ కనిపించాడు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ అయితే మనకు మిక్కీ మౌజ్ సెలక్షన్ కమిటీ ఉందంటూ ఎద్దేవా చేశాడు. సెలక్టర్లు అనుష్కకు టీ సర్వ్ చేయడంలో బిజీగా ఉన్నారు అని కూడా వివాదాస్పద కామెంట్ చేశాడు. ఈ వివాదంపై ఇన్నాళ్లకు ఎమ్మెస్కే స్పందించాడు. తాజాగా క్రికిన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఇండియన్ టీమ్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండటం ఎంత కష్టమో అతడు వివరించాడు.
అనుష్కకు టీ సర్వ్ చేసిన ఘటనలో సెలక్షన్ కమిటీని అనవసరంగా వివాదంలోకి లాగారు. సెలక్షన్ కమిటీలో ఉండటం చాలా కష్టం. ప్లేయర్స్ను ఎంపిక చేయడం, తొలగించడంపై విమర్శలు వస్తాయి. కానీ ఆ టీమ్ సక్సెస్ అయినప్పుడు మాత్రం రావాల్సిన క్రెడిట్ ఇవ్వరు. ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు ఎవరూ సెలక్షన్ కమిటీని మెచ్చుకోలేదు. అయినా మేము పెద్దగా పట్టించుకోలేదు. టీమ్ మేనేజ్మెంట్ మా పనిని గుర్తించింది. అది చాలు అని ప్రసాద్ అన్నాడు.