ఈ ఏడాది ఐపీఎల్లో ప్లాప్ షో చూపించిన జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సీజన్లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందే ధోనీ నుంచి ఈ జట్టు పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. పూర్తిగా నిరాశపరిచాడు. వరుస ఓటములతో చివరి స్థానం కోసం ముంబైతో పోటీ పడిందా జట్టు.
మధ్యలో కొంచెం గేరు మార్చి రెండు విజయాలు అందుకున్నప్పటికీ.. జట్టు ఆటతీరు మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని, మళ్లీ ధోనీనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని జడ్డూ వెల్లడించాడు. ఈ క్రమంలో కెప్టెన్సీ గురించి ధోనీ మాట్లాడాడు. కెప్టెన్గా జడేజా ఆడిన తొలి రెండు మ్యాచుల్లో తాను సాయం చేశానని చెప్పాడు.
‘‘మొదటి రెండు మ్యాచుల్లో ఫీల్డింగ్ యాంగిల్స్ నేనే చెప్పాను. అలాగే మ్యాచ్ గురించి జడ్డూకు కావలసిన సమాచారం అంతా అందించా. రెండు మ్యాచుల తర్వాత అది కూడా ఆపేశాను. స్పూన్ ఫీడింగ్ చేయడం వల్ల కెప్టెన్కు ఎలాంటి ఉపయోగం ఉండదని భావించే అలా చేశాను’’ అని ధోనీ వివరించాడు. ఆ రెండు మ్యాచులు ముగిసిన తర్వాత పూర్తి కంట్రోల్ జడేజాకు ఇచ్చేశానని చెప్పాడు.