భోపాల్ : ఓ భర్త తన భార్యతో గొడవ ఆమె చేతి వేళ్లను నరికివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బేతూల్ పరిధిలోని చిచోలి గ్రామంలో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
చిచోలి గ్రామానికి చెందిన రాజు వంశకర్ అనే వ్యక్తికి గత కొంతకాలం నుంచి తన భార్యతో గొడవలు ఉన్నాయి. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అదే రోజు రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో ఒక చేయి బొటనవేలితో సహా మరో చేతి మూడు వేళ్లను నరికివేశాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం హమిదియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి ఘటనే మార్చి 22న సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య చేతి వేళ్లను నరికి ఆమెను అడవిలో వదిలిపెట్టిన విషయం తెలిసిందే.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్
ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత పదిహేను రోజుల్లో ఇలాంటి ఘటనలు మూడు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ముగ్గురు సోదరిమణులు వారి భర్తల చేతిలో దాడులకు గురవడం బాధాకరమైన విషయమన్నారు. ఇలాంటి నేరస్తుల కోసం కఠినమైన చర్యలు రూపొందిస్తామని సీఎం పేర్కొన్నారు.