ఇంగ్లండ్-ఇండియా మధ్య గురువారం లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో వన్డే మ్యాచ్ అరుదైన కలయికలకు వేదికైంది. వేలాది అభిమానులతో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా లార్డ్స్ లో మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించినది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా.
టీమిండియాలో ఈ ఇద్దరి కెరీర్ లు దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ ఇద్దరూ కలిసి ఆడారు. భారత క్రికెట్ అభిమానులు ఈ ఇద్దరినీ రామ-లక్ష్మణులుగా భావిస్తారు. ఇక తమిళ తంబీలైతే వీరిని ‘చిన్న తాల (నాయకుడు అని అర్థం) పెద్ద తాల’ అని పిలుస్తారు. ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయని, అందుకే ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఐపీఎల్ వేలంలో రైనా ను ధోని కావాలనే పక్కనబెట్టాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే తాజాగా ఈ ఇద్దరూ లార్డ్స్ లో కలిసి ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు. ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్న ధోని.. గడిచిన పది రోజులుగా ఇంగ్లండ్ లోనే గడుపుతున్నాడు. తాజాగా అతడు రైనాతో కలిసి ఒకే కార్ లో లార్డ్స్ వన్డే కు వచ్చి కలిసి మ్యాచ్ వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. ధోని-రైనాతో పాటుగా హర్భజన్ సింగ్ కూడా లార్డ్స్ లో మ్యాచ్ చూశాడు.
చెన్నై తన అధికారిక ట్విటర్ ఖాతాలో ధోని-రైనా ల వీడియోను షేర్ చేస్తూ.. ‘సోదరుల కలయిక..’ అని పోస్ట్ చేసింది. ఈ వీడియో చెన్నై అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ నూ ఖుషీ చేసింది. లార్డ్స్ వన్డేకు ధోని, రైనా, భజ్జీతో పాటు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ లు కూడా విచ్చేశారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్.. వంద పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.
The Reunion of Brothers! 💛
THALA 🤝 thala! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/ppLLVgZWRb— Chennai Super Kings (@ChennaiIPL) July 15, 2022