Morne Morkel: వన్డే వరల్డ్ కప్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి కనీసం లీగ్ దశ కూడా దాటకుండా ఇంటిబాట పట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్గా ఉన్న సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వరల్డ్ కప్ ముగిసి బాబర్ సేన పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాక మోర్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జూన్లో పాకిస్తాన్ జట్టుతో కలిసిన మోర్నీ.. ఆరు నెలలు కూడా గడవకుండానే తన బాధ్యతల నుంచి విరమించాడు.
ప్రపంచకప్లో పాకిస్తాన్ తొమ్మిది మ్యాచ్లలో నాలుగింట మాత్రమే విజయం సాధించి ఐదు మ్యాచ్లలో ఓడి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. గతనెలలో అహ్మదాబాద్ వేదికగా భారత్తో ముగిసిన మ్యాచ్ లో ఓడిన తర్వాత పాక్ వరుసగా మూడు మ్యాచ్లలో అపజయాల పాలైంది. తర్వాత కివీస్తో గెలిచినా చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో కంగుతింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ వైఫల్యమే ఆ జట్టును నిండా ముంచింది. పాక్ ప్రధాన బౌలర్లుగా ఉన్న షహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్లతో పాటు పలు మ్యాచ్లలో ఆడిన హసన్ అలీ, మహ్మద్ వసీం (జూనియర్)లు భారీ పరుగులిచ్చుకున్నారు. ముఖ్యంగా హరీస్ రౌఫ్ అయితే ఈ టోర్నీలో ఏకంగా 500కు పైగా పరుగులిచ్చి ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్తరికార్డు నమోదుచేశాడు.
Morne Morkel resigns as Pakistan bowling coach
Details here ⤵️ https://t.co/El3BgWVbjh
— PCB Media (@TheRealPCBMedia) November 13, 2023
పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా భారత పిచ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. బౌలర్ల వైఫల్యంతో పాకిస్తాన్ మాజీలు మోర్నీ మోర్కెల్పై విమర్శలు గుప్పించారు. వసీం అక్రమ్తో పాటు ముస్తాక్ అహ్మద్ వంటి ఆటగాళ్లు పాక్ బౌలింగ్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మోర్నీ తన పదవి నుంచి తప్పుకున్నాడు. కాగా మోర్నీ రాజీనామాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంగీకరించింది. పాకిస్తాన్ జట్టు తమ తర్వాత మ్యాచ్లను ఆస్ట్రేలియాతో ఆడనుంది. రాబోయే నెలలో బాబర్ సేన.. ఆస్ట్రేలియాలో మూడు మ్యాచ్లు టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.