డే అండ్ నైట్ పోరులో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ
మధ్యాహ్నం 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో..
100సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఇది వందో టెస్టు మ్యాచ్
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో గులాబీ బంతితో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడేందుకు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కాగా.. సొంతగడ్డపై సత్తాచాటాలని కోహ్లీసేన.. పింక్ బాల్తో దుమ్మురేపాలని ఇంగ్లిష్ జట్టు తహతహలాడుతున్నాయి.
ఫ్లడ్లైట్లు లేకుండానే..అధునాతన టెక్నాలజీతో నిర్మించిన మొతెరా స్టేడియంలో ఫ్లడ్లైట్లకు బదులు స్టేడియంపై భాగం చుట్టూతా ఎల్ఈడీ లైట్లు అమర్చారు. భారత్లో ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి.
అహ్మదాబాద్: సొంతగడ్డపై టీమ్ఇండియా మరో పరీక్షకు రెడీ అయింది. చెన్నైలో జరిగిన రెండు టెస్టుల్లో ఒకటి నెగ్గి.. ఒకటి ఓడిన కోహ్లీసేన.. మొతెరా వేదికగా ఇంగ్లండ్తో మూడో టెస్టులో తలపడనుంది. భారత్లోని ఇతర పిచ్లతో పోల్చుకుంటే పచ్చిక ఎక్కువ కనిపిస్తున్న ఈ వికెట్పై భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలో దిగే అవకాశాలున్నాయి. ఆరంభం నుంచి పింక్ బంతితో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపని భారత జట్టు.. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పీఠం అధిరోహించాక తొలిసారి బంగ్లాదేశ్తో గులాబీ టెస్టు ఆడింది. ఫ్లడ్లైట్ల వెలుతురులో భారీ జనసందోహం మధ్య జరిగిన ఆ మ్యాచ్ టీమ్ఇండియా జోరుతో పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ వేదికగా గులాబీ బంతితో మ్యాచ్ ఆడిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆ పరాజయాన్ని మరిపించేలా విజృంభించాలని టీమ్ఇండియా ఉత్సుకతతో ఉంది. రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ, రహానే, పంత్, అశ్విన్, అక్షర్తో భారత బ్యాటింగ్ బలంగా ఉండగా.. గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న స్పీడ్ స్టర్ బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్తో పాటు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఉమేశ్లలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. మరోవైపు తమకు అనుకూలమైన వాతావరణంలో దుమ్మురేపాలని ఇంగ్లండ్ భావిస్తున్నది.
పిచ్, వాతావరణం
మొతెరాలో పచ్చికతో కూడిన పిచ్ దర్శనమిస్తున్నది. కొత్తగా నిర్మించిన తర్వాత ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్నా.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది. వాతావరణం వేడిగా ఉండనుంది. మ్యాచ్కు వర్ష సూచనలేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, ఉమేశ్/సిరాజ్, జస్ప్రీత్.ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లే, క్రాలీ, బెయిర్స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్, బెస్/వోక్స్, ఆర్చర్, లీచ్, అండర్సన్.