బ్రిస్బేన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భారత్ అదరగొట్టింది. అసలు సిసలైన పోరుకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్లో టీమ్ఇండియా సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. సోమవారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 6 పరుగుల తేడాతో ఆసీస్పై అద్భుత విజయం సాధించింది. గాయపడ్డ బుమ్రా స్థానంలో జట్టుకు ఎంపికైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ(1-0-4-3)మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ 180 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(76) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతావారు తేలిపోయారు. భువనేశ్వర్(2/20) రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్దీప్సింగ్, హర్షల్ పటేల్, చాహల్ ఒక్కోవికెట్ తీశారు. ఆఖరి ఓవర్ వేసిన షమీ…వరుస బంతుల్లో కమిన్స్(7), ఆగర్(0, రనౌట్), ఇంగ్లిస్(1), రిచర్డ్సన్(0) పెవిలియన్ పంపి జట్టును గెలుపు సంబురాల్లో ముంచాడు. అంతకుముందు కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధసెంచరీలతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 186/7 స్కోరు చేసింది. రోహిత్శర్మ (15), విరాట్కోహ్లీ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కేన్ రిచర్డ్సన్(4/30) నాలుగు వికెట్లతో విజృంభించాడు.
విండీస్కు స్కాట్లాండ్ ఝలక్
హోబర్ట్: టీ20 ప్రపంచకప్లో వరసగా రెండో రోజూ సంచలనం నమోదైంది. అనామక స్కాట్లాండ్ జట్టు రెండుసార్లు ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్ను 42 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది.