Mohammed Shami | టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం, భార్య హసీన్ జహాన్తో కొనసాగుతున్న వివాదంపై తొలిసారిగా పెదవి విప్పాడు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తనపై వస్తున్న ఆరోపణలపై వాస్తవాలను వెల్లడించాడు. తాను గత విషయాలను పట్టించుకోనని, తన పూర్తి దృష్టి క్రికెట్ కెరీర్పై ఉందని పేర్కొన్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంపై అడిగిన ప్రశ్నకు షమీ కూల్గా సమాధానం ఇచ్చాడు. ‘ ఈవిషయాన్ని వదిలేయండి. గతం గురించి నేను ఎప్పుడూ బాధపడను. అది జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని నేను అనుకోవడం లేదు. నాకు నేను నిందించుకోవడం లేదు. ఇప్పుడు క్రికెట్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ వివాదాలు నాకు అవసరం లేదు’ అంటూ పేర్కొన్నారు. 2014లో హసీన్ జహాన్ను వివాహం చేసుకున్న షమీ.. నాలుగేళ్ల తర్వాత విడిపోయాడు. 2018 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ సమయంలో హసీన్ జహాన్ షమీపై, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది. గృహ హింస, మానసిక వేధింపులకు గురిచేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ నెలలో కూడా, షమీని వుమనైజర్గా పేర్కొంటూ.. తన సొంత కూతురికి కాకుండా గర్ల్ఫ్రెండ్స్కు ఖరీదైన బహుమతులు ఇస్తున్నాడని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక షమీ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు. అయితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన షమీ, 9 మ్యాచ్లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచారు. ఫామ్ కోల్పోవడంతో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో పాటు, సెప్టెంబర్లో జరుగబోయే ఆసియా కప్ 2025 టోర్నీకి సైతం దూరమైన విషయం తెలిసిందే.