దుబాయ్: వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డును పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ బ్రేక్ చేశాడు. టీ20ల్లో గేల్ పేరిట ఉన్న రికార్డును రిజ్వాన్ బద్దలు కొట్టాడు. ఆదివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2015లో గేల్ అత్యధికంగా టీ20ల్లో 1665 రన్స్ చేశాడు. అయితే ఆరేళ్ల క్రితం నమోదు అయిన ఆ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది టాప్ ఫామ్లో ఉన్న పాక్ ఓపెనర్ రిజ్వాన్ ఇప్పటి వరకు టీ20 మ్యాచుల్లో 1676 రన్స్ చేశాడు. క్రిస్ గేల్ 2015లో 36 మ్యాచ్లు ఆడి మూడు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆ ఏడాది అత్యధికంగా గేల్ 151 రన్స్ చేశాడు. ఇక పాకిస్థాన్ బ్యాటర్ రిజ్వాన్ ఈ ఏడాది టీ20ల్లో ఒక సెంచరీతో పాటు 15 హాప్ సెంచరీలు చేశాడు. అత్యధికంగా ఓ మ్యాచ్లో 104 రన్స్ చేశాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న రిజ్వాన్.. తాజా వరల్డ్కప్లో ఇండియాతో జరిగిన మ్యాచ్లో 79 రన్స్ చేసిన విషయం తెలిసిందే.