కుత్బుల్లాపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్కు తగిన గుర్తింపు లభిస్తున్నది. టర్కీ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించి సొంతగడ్డపై అడుగుపెట్టిన నిఖత్కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) విద్యార్థులు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. కాలేజీలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్ఎల్ఆర్ఐటీ చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి..నిఖత్కు రూ.4 లక్షల చెక్ అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ‘మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నిఖత్ ప్రపంచ చాంపియన్గా నిలువడం మామూలు విషయం కాదు. దీని వెనుక ఆమె కఠోర శ్రమ దాగుంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా పారిస్ ఒలింపిక్స్ వరకు నిఖత్కు ప్రతీ నెల రూ.20 వేలు అందిస్తున్నాం’ అని అన్నారు.
సుచిత్రా అకాడమీ రూ.10 లక్షలు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైటిల్ దక్కించుకున్న నిఖత్కు సుచిత్రా అకాడమీ రూ.10 లక్షల నగదు ప్రోత్సాహం అందించింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు ప్రవీణ్రాజు, ప్రదీప్రాజు జరీన్కు చెక్ అందించారు. ప్రపంచ చాంపియన్గా నిలువడంలో కోచ్ ప్రదీప్రాజు ఎంతో కృషి ఉందని ఆమె పేర్కొంది.