అంతర్జాతీయ క్రికెట్లో రెండు దశాబ్దాలకు పైగా హవా కొనసాగిస్తున్న మిథాలీరాజ్.. తన పరుగుల దాహం ఇంకా తీరలేదంటున్నది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను వెనక్కినెట్టి శిఖరాగ్రాన నిలిచిన మిథాలీరాజ్.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లోనూ ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నది. ‘లేడీ సచిన్ టెండూల్కర్’గా ప్రశంసలందుకుంటున్న మిథాలీ.. తాజా సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్సెంచరీలతో దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో ఈ హైదరాబాదీ సూపర్ స్టార్పై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : మహిళల క్రికెట్లో ఆమె సునీల్ గవాస్కర్ అని ఒకరంటే.. కాదు కాదు లేడీ సచిన్ టెండూల్కర్ అని మరొకరు.. ఆమె నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టడం సాధ్యంకాదని ఒకరంటే.. అసలు దారిదాపుల్లో నిలువడం కూడా కష్టమే అని మరొకరు.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత కెప్టెన్ మిథాలీరాజ్ విజృంభణ చూసిన వారి అభిప్రాయాలివి. ఏడేండ్ల తర్వాత ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ మిథాలీ సింగిల్ డిజిట్కే పరిమితమవడంతో ఇక ఆమె పనైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వయసు మీదపడింది.. ఇక తప్పుకోవడమే మేలు అనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇలాంటి సమయంలో మిథాలీ వన్డేల్లో వరుస హాఫ్సెంచరీలతో చెలరేగిపోయింది. తొలి వన్డేలో సహచరులంతా విఫలమైన చోట 72 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ.. రెండో వన్డేలో 59 పరుగులు తన ఖాతాలో వేసుకుంది. ఇక చివరి మ్యాచ్లోనైతే మిథాలీ విశ్వరూపం కనబర్చింది. కష్టతరమైన లక్ష్యఛేదనలో సహచరులంతా పెవిలియన్కు వరుస కట్టినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు సాగింది. 75 పరుగుల ఆజేయ ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా నిలిచిన మిథాలీ.. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ప్రపంచకప్లోనూ ఇదే జోరు కొనసాగిస్తానని అంటున్నది.
ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఎన్నో ఒడుదొడుకులు, సవాళ్లను ఎదుర్కొన్నా. 22 ఏండ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నా.. పరుగుల దాహం తీరలేదు. టీమ్ఇండియాకు మరిన్ని విజయాలు అందించాలని అనుకుంటున్నా.
టాప్-5
మిథాలీరాజ్ 10337 (భారత్)
చార్లెట్ ఎడ్వర్డ్స్ 10273 (ఇంగ్లండ్)
సుజీ బేట్స్ 7849 (న్యూజిలాండ్)
సఫానీ టేలర్ 7832 (వెస్టిండీస్)
మెగ్లానింగ్ 7024 (ఆస్ట్రేలియా)