న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆటలోని అన్నీ ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇన్నేండ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు.. జట్టుకు సారథిగా కొనసాగడం ఎంతో గర్వంగా ఉందని లేఖలో పేర్కొంది. 232 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మిథాలీ.. మహిళల క్రికెట్లో మరెవరికీ సాధ్యం కానీ రీతిలో 7805 పరుగులు చేసింది.
జాతీయ జట్టు తరఫున 12 టెస్టులు, 89 టీ20లు ఆడిన 39 ఏండ్ల మిథాలీ.. మూడు ఫార్మాట్లలో కలిపి 10868 పరుగులు తన పేరిట రాసుకుంది. 1999లో పదహారేండ్ల ప్రాయంలో తొలిసారి భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ 23 ఏండ్ల పాటు తన ఆటతో అభిమానులను అలరించింది. ఈ ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్లో మిథాలీ చివరిసారి మైదానంలో దిగింది. ‘సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. ఒకప్పుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగిన నేను.. ఇన్నాళ్లు జాతీయ జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉంది. క్రికెట్ నాకు చాలా ఇచ్చింది.
ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని ఈ రోజు నిర్ణయించుకున్నా. బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. ప్రస్తుతం భారత క్రికెట్ యువతరం చేతుల్లో ఉంది. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇన్నాళ్లు దేశం తరఫున ఆడటం నిజంగా గర్వకారణం. భారత మహిళల క్రికెట్కు నా వంతు సేవ చేశానని అనుకుంటున్నా’అని మిథాలీ లేఖలో పేర్కొంది. మిథాలీ క్రికెట్కు చేసిన సేవలను ఐసీసీ, బీసీసీఐ కొనియాడగా.. క్రీడాలోకం మొత్తం లెజెండ్ మిథాలీ అంటూ ఆమెను ఆకాశానికెత్తింది.
లెక్కకు మిక్కిలి రికార్డులతో రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్కు ఘనంగా వీడ్కోలు పలికిన మిథాలీరాజ్కు అభినందనలు. దేశంలో ఎంతో మంది బాలికలకు మీరు ఆదర్శంగా నిలిచారు. జీవితంలో మరో ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నాను.
– కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అభినందనలు
భారత్కు ప్రాతినిధ్యం వహించడమనేది ఒక కల, అది కొందరికే సాధ్యం. 23 ఏండ్ల పాటు దేశానికి ఆడటం అద్భుతం. దేశ మహిళల క్రికెట్కు నువ్వొక పిల్లర్. ఎంతో మంది అమ్మాయిలను తీర్చిదిద్దావు. సుదీర్ఘ కాలం పాటు దేశ క్రికెట్కు సేవలందించిన నీకు శుభాకాంక్షలు.
– వీవీఎస్ లక్ష్మణ్
ఉదయాన్నే నిద్రలేచి గ్రౌండ్కు వెళ్లాలంటే బద్ధకించిన ఎనిమిదేండ్ల చిన్నారి.. తన 23 ఏండ్ల క్రికెట్ కెరీర్తో యావత్ జాతిని జాగృతం చేసింది! ఏంటీ భారత్లో మహిళలు కూడా క్రికెట్ ఆడుతారా? అనే అవమానాలు ఎదుర్కొన్న ఆ అమ్మాయి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది!
సచిన్ టెండూల్కర్ను తలపించే కవర్డ్రైవ్లు.. సునీల్ గవాస్కర్ను మించిన బ్యాక్ ఫుట్ పంచ్లు..విరాట్ కోహ్లీని తలదన్నే మాస్టర్ క్లాస్తో 23 ఏండ్ల పాటు భారత మహిళా క్రికెట్కు చుక్కానిలా నిలిచిన మిథాలీ దొరై రాజ్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 39 ఏండ్ల వయసులో ఆటకు టాటా చెప్పిన ఈ హైదరాబాదీపై ప్రత్యేక కథనం..
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ఆరేండ్ల వయసులో తన సోదరులతో కలిసి జింఖానా గ్రౌండ్లో ప్రాక్టీస్ ప్రారంభించిన మిథాలీ.. చిన్నప్పుడు డ్యాన్సర్ కావాలని కలలు కనేది. భరతనాట్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన మిథాలీని.. తల్లిదండ్రులు క్రికెటర్ను చేయాలని భావిస్తే.. ఆమె మాత్రం మైదానం బయట కూర్చొని హోంవర్క్ చేసుకోవడంతో పాటు కునికిపాట్లు తీసేది. ఆరంభంలో మిథాలీ అయిష్టంగానే బ్యాట్ పట్టినా.. ఆమె ఆటతీరు ప్రతి ఒక్కరినీ కట్టిపడేసేది. డ్యాన్స్ను పక్కన పెట్టి పూర్తిస్థాయి క్రికెట్పై దృష్టిపెట్టిన మిథాలీ.. చూస్తుండగానే మంచి ప్లేయర్గా ఎదిగింది. 13 ఏండ్ల వయసులో దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపిన ఈ హైదరాబాదీ.. అండర్-16, అండర్-19 టోర్నీల్లో పరుగులు వరద పారించి 1999లో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైంది. అరంగేట్ర పోరులోనే శతకం బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిన మిథాలీ.. ఆ తర్వాత ఏరోజూ వెనుదిరిగి చూసుకోలేదు.
రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో మిథాలీ ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంది. ఒకప్పుడు కనీస గుర్తింపు లేని మహిళల జట్టులో సభ్యురాలిగా ఉన్న మిథాలీ.. ఆ తర్వాత విపరీతమైన జనాకర్శణ కలిగిన టీమ్కు సుదీర్ఘ కాలం కెప్టెన్గా కొనసాగింది. విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే అనుమతులు లభించడమే గొప్ప అనుకునే సమయం నుంచి విమానాశ్రయాల్లో మహిళల జట్టుకు బ్రహ్మరథం పట్టేంత వరకు భారత క్రికెట్లో మిథాలీ ప్రస్థానం కొనసాగింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ రెండు ఫైనల్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక కెప్టెన్గా చరిత్రకెక్కిన మిథాలీ.. బ్యాటింగ్లో లెక్కకు మిక్కిలి ఘనతలను తన ఖాతాలో వేసుకుంది. ‘ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ మహిళా క్రికెటర్ మిథాలీనే’అని భారత మహిళల మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి పేర్కొంటే.. సునీల్ గవాస్కర్ తర్వాత బంతిని కళాత్మకంగా కొట్టడంలో మిథాలీని మించిన వారు లేరని యావత్ ప్రపంచం అంగీకరించింది.
మైదానంలో ఆటతీరుతో ఆకట్టుకునే మిథాలీ.. బయట హుందాతనంతో తనపై గౌరవాన్ని మరింత పెంచుకుంది. ఫ్యాషన్ విషయంలో ముందుండే మిథాలీ.. తన మాటతీరుతో అభిమానుల మనసులు చూరగొన్న సందర్భాలెన్నో. అయితే రెండు దశాబ్దాల పాటు భారత మహిళల క్రికెట్ను ఏలిన మిథాలీ.. 2018 టీ20 ప్రపంచకప్ సమయంలో అప్పటి కోచ్ రమేశ్ పొవార్పై లేఖ రాసి వార్తల్లోకెక్కింది. తన స్ట్రయిక్రేట్ను ప్రధాన కారణంగా చూపుతూ జట్టు నుంచి తప్పించడంపై బాహాటంగా విమర్శలు చేసింది. ఈ ఘటన తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న హైదరాబాదీ.. తాజాగా వన్డే, టెస్టులకు గుడ్బై చెప్పింది. దేశంలో ఎందరో అమ్మాయిలు బ్యాట్ పట్టేందుకు ప్రేరణగా నిలిచిన మిథాలీ.. ఇక ముందు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పింది. మరి మనం కూడా ఈ లెడీ సచిన్కు ఆల్ ది బెస్ట్ చెబుదాం!
1999 జూన్ 26న ఐర్లాండ్తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మిథాలీ.. తొలి మ్యాచ్లో అజేయంగా 114 పరుగులు చేసి అదుర్స్ అనిపించింది.
సుదీర్ఘ కెరీర్: మహిళల అంతర్జాతీయ వన్డేల్లో మిథాలీ 22 ఏండ్ల 274 రోజుల పాటు తన కెరీర్ కొనసాగించింది. టెస్టుల్లో 19 ఏండ్ల 262 రోజులు ప్రాతినిధ్యం వహించింది.
పూర్తి పేరు: మిథాలీ దొరైరాజ్
పుట్టిన తేదీ: డిసెంబర్ 3, 1982, రాజస్థాన్
టెస్టులు: 12, పరుగులు: 699, సగటు: 43.68,
సెంచరీలు: 1, అర్ధసెంచరీలు: 4
వన్డేలు: 232, పరుగులు: 7805, సగటు: 50.68, సెంచరీలు: 7, అర్ధసెంచరీలు: 64, వికెట్లు: 8
టీ20లు: 89, పరుగులు: 2364, సగటు: 37.52, అర్ధసెంచరీలు: 17
తొలి వన్డే : ఐర్లాండ్పై జూన్ 26, 1999
చివరి వన్డే: దక్షిణాఫ్రికాపై మార్చి 27, 2022
తొలి టెస్టు: ఇంగ్లండ్పై జనవరి 14-17, 2002
ఆఖరి టెస్టు: ఆస్ట్రేలియాపై సెప్టెంబర్ 30- అక్టోబర్ 3, 2021
తొలి టీ20: ఇంగ్లండ్పై ఆగస్టు 5, 2006
చివరి టీ20: ఇంగ్లండ్పై మార్చి 9, 2019