Misbah-ul-Haq : భారత ఆటగాడు విరాట్ కోహ్లీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? అనే చర్చ మళ్లీ మొదలైంది. తాజాగా బాబర్ రెండు ఐసీసీ అవార్డులు గెలవడంతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బాబర్ అత్యుత్తమం అంటున్నారు. అయితే.. కోహ్లీ, బాబర్లను పోల్చడం అనేది అర్థరహితం అని పాక్ మాజీ కోచ్ మిస్బావుల్ హక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘బాబర్, కోహ్లీలను ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు. ఎందుకంటే.. బాబర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. కానీ, విరాట్ కోహ్లీ ఇప్పటికే చాలా ఎక్కువ క్రికెట్ ఆడాడు. బాబర్ కూడా అన్ని మ్యాచ్లు ఆడినప్పుడే అతడిని కోహ్లీతో పోల్చి చూడాలి. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీతో సరితూగే ఆటగాడు మరొకరు లేరు అని మిస్బావుల్’ హక్ తెలిపాడు. అంతేకాదు బాబర్ క్లాస్ ఆటగాడు. అతను భవిష్యత్లో కోహ్లీలా రికార్డులను తిరగరాస్తాడు అని మిస్బా వెల్లడించాడు.
2007 పొట్టి ప్రపంచకప్
మిస్బావుల్ హక్ పేరు వినగానే అందరికీ 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకొస్తుంది. 158 లక్ష్య ఛేదనలో ఒకవైపు వికెట్లు పడుతున్నా మిస్బా పాక్ను గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 రన్స్ కావాలి. జోగిందర్ శర్మ వేసిన వేసిన ఆ ఓవర్లో తొలి బంతి వైడ్. మూడో బంతికి మిస్బా సిక్సర్ బాదాడు. దాంతో భారత జట్టు ఆందోళనలో పడింది. అయితే.. నాలుగో బంతని ఫైన్ లెగ్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. శ్రీశాంత్ క్యాచ్ అందుకోవడంతో పాక్ 152 పరుగులకే పరిమితమైంది. భారత్ ఛాంపియన్గా అవతరించింది.
వరుసగా రెండో ఏడాది (2021, 2022) వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో బాబర్, కోహ్లీ రికార్డు అందుకున్నాడు. కోహ్లీ 2017, 2018లో వరుసగా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. పోయిన ఏడాది బాబర్ మూడు ఫార్మాట్లలో 2,600 రన్స్ స్కోర్ చేశాడు. అంతేకాదు అతని నేతృత్వంలోని పాక్ ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది.