హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పోర్ట్స్ పాలసీపై రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, ప్లేయర్లను ప్రోత్సహించడం, కోచ్ల సంక్షేమం, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై బుధవారం అధికారులతో మంత్రి భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్లేయర్లు పతకాలు సాధించేలా వివిధ దేశాలు అవలంభిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకుంటూ ముసాయిదా పాలసీని త్వరగా రూపొందించాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే క్యాబినెట్ కమిటీ సమావేశం నాటికి ముసాయిదాను సిద్ధం చేయాలని సూచించారు.
అనేక రంగాల్లో వలనే క్రీడల్లోనూ రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలిపిపేందుకు కృషి చేయాలన్నారు. క్రీడాపాలసీ విషయంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. పతకాలు సాధించిన ప్లేయర్లనే కాకుండా..వారిని తీర్చిదిద్దిన కోచ్లకు పాలసీలో తగిన ప్రాధాన్యమివ్వాలని అన్నారు. క్రీడాశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరాజు, జాయింట్ సెక్రెటరీ రమేశ్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్యాదవ్, సాట్స్ అధికారులు పాల్గొన్నారు.