హైదరాబాద్, నమస్తే తెలంగాణ: థాయ్లాండ్ వేదికగా జరిగిన ఆసియా మహిళల అండర్-18 వాలీబాల్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ ప్లేయర్ కత్రావత్ శాంతకుమారికి తగిన గుర్తింపు లభించింది. టోర్నీలో పాల్గొని మంగళవారం హైదరాబాద్కు చేరుకున్న శాంతకు ఘనస్వాగతం లభించింది. కష్టాలకు ఎదురొడ్డి పేద కుటుంబం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన శాంతను మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్యాంప్ ఆఫీస్లో ఆమెను ఘనంగా సన్మానించిన మంత్రి నిరంజన్రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించడంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. వాలీబాల్లో వనపర్తి పేరును నిలబెడుతున్న శాంతకుమారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న శాంత స్వగ్రామం వనపర్తి మండలం చిట్యాల తూర్పు తండా. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో శాంతకు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోచ్ అరుణారెడ్డితో పాటు శాంత తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.