నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి, రవీంద్రభారతి: గుజరాత్ వేదికగా ఈనెల 29 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్ కోసం తెలంగాణ రాష్ట్ర జట్టు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగబోతున్న నేషనల్ గేమ్స్లో పతకాలు కొల్లగొట్టేందుకు పట్టుదలతో ఉన్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్), రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ప్లేయర్లకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకెళుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు క్రీడా ప్రాంగణాలను యుద్ధ ప్రాతిపాదికగా ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 6500 గ్రామాల్లో ప్రాంగణాలను నెలకొల్పుతున్నాం. దీనికి తోడు నియోజకవర్గాల వారీగా మినీ స్టేడియాలు నిర్మాణం చేస్తున్నాం. గుజరాత్లో జరిగే 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలి.
గేమ్స్ కోసం ప్రభుత్వం రూ.60 లక్షల మంజూరుకు ఆమోదం తెలిపింది. అందుబాటులో ఉన్న వనరులతో ప్లేయర్లు పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. జాతీయ గేమ్స్లో పతకాలు సాధించిన ప్లేయర్లకు ప్రైజ్మనీ అందిస్తాం. త్వరలోనే నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలచారి, కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, ప్రేమ్రాజ్, మహేశ్, క్రీడాధికారులు పాల్గొన్నారు.