హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ప్లేయర్లకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉడిపి(కర్ణాటక) వేదికగా జరిగిన 18వ జాతీయ యువజన అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకాలు సాధించిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో భవిష్యత్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి’ అని అన్నారు. జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో ప్రణతి, హర్షవర్ధన్, అజారుద్దీన్, రమేశ్, రాఘవేంద్ర, సాయిసంగీత పతకాలు సాధించారు.