హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తమిళనాడులో జరిగిన మూడవ జాతీయ సిలంబం చాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. బుధవారం తమ నివాసంలో ప్లేయర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చాంపియన్షిప్లో అండర్-14 విభాగంలో కంది వరేణ్య డబుల్ స్టిక్ ఈవెంట్లో స్వర్ణం, సింగిల్ స్టిక్ విభాగంలో రజతం, గ్రూప్ రిబ్బన్ స్టిక్ పనితీరులో పసిడి సాధించింది. అలాగే బాలికల అండర్-12 విభాగంలో కంది ధన్వి డబుల్ స్టిక్ ఈవెంట్లో కాంస్యం, గ్రూపు రిబ్బన్ స్టిక్లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.