హైదరాబాద్ : కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత్ 5-0తో కార్లే మెక్ నాల్ (నార్త్ ఐర్లాండ్)పై విజయం సాధించింది. గతేడాది జాతీయ చాంపియన్షిప్ నుంచి బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న నిఖత్.. ఇటీవలే ప్రపంచ చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. అదే జోరు బర్మింగ్హామ్లోనూ కొనసాగించిన ఈ ఇందూరు అమ్మాయి..
అదిరిపోయే పంచ్లతో ప్రత్యర్థిని బెదరగొట్టింది.
Congratulating Telangana’s pride, the World champion @Nikhat_Zareen on clinching the gold medal for India in the women’s 50 KG light flyweight category at the 2022 Commonwealth Games pic.twitter.com/tLtepPsMX7
— KTR (@KTRTRS) August 8, 2022
స్ట్రాంజా మెమొరియల్లో 52 కేజీల ఈవెంట్లో పసిడి నెగ్గిన నిఖత్.. కామన్వెల్త్ కోసం రెండు కేజీలు తగ్గి 50 కిలోల విభాగంలో బరిలోకి దిగింది. బౌట్ ఆరంభం నుంచే చెలరేగిపోయిన నిఖత్.. రింగ్లో ఒకే చోటు నిలబడి పోకుండా అద్భుతమైన ఫుట్వర్క్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతూ ముష్టిఘాతాలు కురిపించింది. తొలి రౌండ్ ముగిసేలోగానే న్యాయ నిర్ణేతలు ఒక అభిప్రాయానికి వచ్చేయగా.. మిగిలిన రెండు రౌండ్లలోనూ ఈ తెలంగణ యువ కెరటం అదే జోష్ కొనసాగించింది. లెఫ్ట్ హుక్, రైట్ జాబ్ను ఒకేసారి ప్రయోగిస్తూ ప్రత్యర్థిని తికమక పెట్టిన నిఖత్.. బౌట్ ముగియగానే తానే గెలిచాననే సంకేతాలు ఇచ్చింది. కాసేపటికే రిఫరీ నిఖత్ చేయి పైకెత్తగా.. ఆనందంలో ఒక్కసారిగా గాల్లోకి పంచ్లు విసిరిన నిఖత్ తన విజయాన్ని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.