సిద్దిపేట అర్బన్, ఆగస్టు 6: రంగనాయకసాగర్ కట్టపై నిర్వహించిన ప్లాస్టిక్ రహిత హాప్ మారథాన్లో ఉమ, రమావత్ రమేశ్ చంద్ర విజేతలుగా నిలిచారు. 21 కిలోమీటర్ల మహిళల విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ అగ్రస్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి దక్కించుకోగా.. మల్లిక ద్వితీయ బహుమతి (రూ.25 వేలు), నవ్య తృతీయ బహుమతి (రూ.10 వేలు) గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో రమేశ్ చంద్ర టాప్లో నిలువగా.. మోతీ చౌదరి, గియో ఆంటోనీ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.
ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో హాఫ్ మారథాన్కు, రంగనాయక సాగర్పై ఇతర రేస్లకు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు హాఫ్ మారథాన్ లాంటి రన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సిద్దిపేట కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే నిర్వహించే ఈ రన్ను ప్రతి సంవత్సరం ఆగస్టు 6న సిద్దిపేటలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఆదివారం హాఫ్ మారథాన్ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహ భరితంగా హాఫ్ మారథాన్
ప్రకృతి ఒడిలో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన పరుగులో రాష్ట్రం నుంచే కాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా అథ్లెట్లు పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించారు. 21 కిలోమీటర్లు, 10కే, 5కే మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. ఇందులో దాదాపు 5 వేల మంది పాల్గొన్నారు. దీంతో రంగనాయక సాగర్ కట్ట జనసంద్రాన్ని తలపించింది. 10కే రన్ మహిళల విభాగంలో స్వప్న (రూ.25 వేలు) ప్రథమ బహుమతి అందుకోగా.. కావ్య (రూ.15 వేలు), గగన శ్రీ (రూ.10 వేలు) వరుసగా ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో సునీల్, మనీశ్, మహేష్ టాప్-3 ప్లేస్లు దక్కించుకున్నారు.