ముంబైతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ ఓపెన్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. 66 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన రాజస్థాన్కు యశస్వి జైస్వాల్ (1), దేవదత్ పడిక్కల్ (7)ను స్వల్ప స్కోర్లకే అవుట్ చేసిన ముంబై షాకిచ్చింది. అయితే కెప్టెన్ సంజూ శాంసన్ (30) తోడు కలవడంతో రెచ్చిబోయిన బట్లర్ ముంబై బౌలర్ల దుమ్ముదులిపాడు.
ఈ క్రమంలోనే 16వ ఓవర్ చివరికి 98 పరుగులతో నిలిచిన అతను.. ఆ తర్వాతి ఓవర్ను పూర్తిగా హెట్మెయర్ (35)కు వదిలేశాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చున్న అతను ఆ ఓవర్లో రెండు సిక్సర్లు రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత 19వ ఓవర్ వరకు బ్యాటింగ్ తీసుకోని బట్లర్.. ఆ ఓవర్ తొలి బంతికి సింగిల్తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ మరుసటి బంతికే హెట్మెయర్.. డీప్ మిడ్వికెట్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ ఐదో బంతికి బట్లర్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్కు తెరపడింది. అదే ఓవర్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ (1) రనౌట్గా వెనుతిరిగాడు.
టైమల్ మిల్స్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి నవదీప్ సైని (2) కూడా అవుటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రియాన్ పరాగ్ (5) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 200పైగా పరుగులు చేస్తుందనుకున్న రాజస్థాన్.. 20 ఓవర్లు ముగిసే సరికి 193/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. పొలార్డ్ ఒక వికెట్ తీసుకున్నాడు.