ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబైకి రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) శుభారంభమే ఇచ్చారు. అయితే దాన్ని ఉపయోగించుకోలేకపోయిన ముంబై బ్యాటర్లు ఒకరి తరువాత ఒకరు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. డెవాల్డ్ బ్రెవిస్ (8), తిలక్ వర్మ (0), కీరన్ పొలార్డ్ (0), రమన్దీప్ సింగ్ (6) విఫలమయ్యారు.
అయితే సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) అదరగొట్టడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరుకు అనూజ్ రావత్ (66), ఫాఫ్ డు ప్లెసిస్ (16) మంచి ఆరంభమే అందించారు. కెప్టెన్ డుప్లెసిస్ యాంకర్ పాత్ర పోషించగా అనూజ్ రెచ్చిపోయాడు.
డుప్లెసిస్ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (48) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 17వ ఓవర్లో దురదృష్టవశాత్తూ రావత్ రనౌట్ అవగా.. 19వ ఓవర్ తొలి బంతికి కోహ్లీ ఎల్బీగా వెనుతిరిగాడు. రెండు పరుగుల దూరంలో అర్థశతకం మిస్సయ్యాడు.
కోహ్లీ అవుటవగానే క్రీజులోకి వచ్చిన మ్యాక్స్వెల్ (8 నాటౌట్) వరుసగా రెండు బౌండరీలు బాది బెంగళూరుకు విజయాన్ని కట్టబెట్టాడు. ముంబై బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, డెవాల్డ్ బ్రెవిస్ చెరో వికెట్ తీసుకున్నారు. బెంగళూరు జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.