IPL 2024 | టీమిండియా టీ20 టీమ్ స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ మూడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన సూర్య.. చీలమండ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో సర్జరీ చేయించుకున్న మిస్టర్ 360.. ఇంకా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే ఉన్నాడు. ప్రస్తుతం అక్కడే ఫిజియోల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కీలక బ్యాటర్ అయిన సూర్య.. ఈ లీగ్లో ఆడతాడా..?
సూర్య గత వారమే ఎన్సీఏలో జాయిన్ అయ్యాడు. అతడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరో రెండు వారాలైనా పట్టొచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన సూర్య.. ముంబై, గుజరాత్తో ఆడే తొలి మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎన్సీఏ గనక క్లీయరెన్స్ ఇస్తే అతడు ముంబై టీమ్లో రెండో వారం (ఏప్రిల్ మొదటి వారం) నుంచి జాయిన్ అవుతాడు.
అయితే సూర్య పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఐపీఎల్ ఆడేందుకు క్లీయరెన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ ఏడాది జూన్లో అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్లో అతడు భారత్ తరఫున అత్యంత కీలకమైన ఆటగాడు. అటువంటి ప్లేయర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని బీసీసీఐ అనుకుంటోంది.
సూర్య ఐపీఎల్ ఎంట్రీపై ముంబై హెడ్కోచ్ మార్క్ బౌచర్ స్పందిస్తూ.. ‘సూర్య ప్రస్తుతం భారత క్రికెట్ మార్గదర్శకత్వంలో ఉన్నాడు. మేం ఎన్సీఏ నుంచి వచ్చే అప్డేట్స్ కోసం వేచి చూస్తున్నాం. మాకు జట్టులో కూడా వరల్డ్ క్లాస్ వైద్య సిబ్బంది ఉన్నారు. వాళ్లు కూడా ఆటగాళ్ల విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. గతంలో మాకు ఫిట్నెస్ సమస్యలు చుట్టుముట్టిన మాట వాస్తవమే. అయితే ఫిట్నెస్ ఇష్యూస్ మా ఒక్కరికే కాదు కదా.. అన్ని జట్లూ ఇదే సమస్యను ఎదుర్కుంటున్నాయి..’ అని అన్నాడు. ఒకవేళ సూర్య.. తొలి వారం ఐపీఎల్ ను మిస్ అయితే అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ముంబైలో ఉన్నారని బౌచర్ తెలిపాడు.