WPL | మహిళల ప్రీమియర్ లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
బెంగళూరు: బౌలర్ల పట్టుదలకు బ్యాటర్ల సహకారం తోడవడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుచేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎలీసా పెర్రి (44) టాప్ స్కోరర్ కాగా.. స్మృతి మంధన (9), సోఫియా డివైన్ (9), సబ్బినేని మేఘన (11), రిచ ఘోష్ (7) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో స్కీవర్ బ్రంట్, పూజ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 15.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అమెలియా కెర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు), యస్తిక భాటియా (31), హీలీ మాథ్యూస్ (26), స్కీవర్ బ్రంట్ (27) రాణించారు. లీగ్లో మూడో విజయం సాధించిన ముంబై 6 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది.