Lasith Malinga | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కొత్త బౌలింగ్ కోచ్ను నియమించుకుంది. ఇన్నాళ్లూ ఆ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఉన్న షేన్ బాండ్ ఇటీవలే ముంబైని వదిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి ప్లేస్లో వచ్చే సీజన్ నుంచి ఆజట్టుకు దశాబ్దకాలం పాటు ఆడిన శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ సేవలందించనున్నాడు. ఈ మేరకు మలింగ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్లో 2009 నుంచి 2019 వరకూ ముంబై ఇండియన్స్కు ఆడిన మలింగ.. 2021, 2022 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ కు బౌలింగ్ కోచ్గా సేవలందించాడు. కానీ తాజాగా అతడు రాజస్తాన్ నుంచి తప్పుకుని ముంబై జట్టుకు తిరిగొచ్చాడు. మలింగ రాకతో ముంబై టీమ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్తో పాటు మలింగల త్రయం రీయూనిట్ అయినట్టయిందని అభిమానులు చెప్పుకుంటున్నారు.
ముంబై ఇండియన్స్ కంటే ముందే మలింగ.. సౌతాఫ్రికాలో జరిగే ఎస్ఎ 20 లీగ్లో ఎంఐ న్యూయార్క్ జట్టుతో పాటు యూఎస్ఎలోని మేజర్ లీగ్ క్రికెట్ లో ముంబై ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్ కూ బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అతడు ముంబై జట్టుతో కలవబోతున్నాడు.
Mumbai Indians in IPL 2024:
Captain – Rohit Sharma.
Batting coach – Kieron Pollard.
Bowling coach – Lasith Malinga.– The GOAT Trio of MI family is back…!!!! pic.twitter.com/VhrcCOXQRG
— CricketMAN2 (@ImTanujSingh) October 20, 2023
ముంబైకి తిరిగిరావడంపై మలింగ స్పందిస్తూ.. ‘ముంబై ఇండియన్స్ టీమ్ కు బౌలింగ్ కోచ్గా వచ్చినందుకు నాకు గర్వకారణం. వన్ ఫ్యామిలీతో నా బంధం మళ్లీ కొనసాగుతుంది. నేను మార్క్ బౌచర్ (ముంబై హెడ్కోచ్), పొలీ (కీరన్ పొలార్డ్), రోహిత్ లతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నా..’అని చెప్పుకొచ్చాడు. ముంబైతో గడిచిన 13 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న మలింగ.. మొత్తంగా ఏడు ట్రోఫీ (నాలుగు ఐపీఎల్) విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు.