సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు నిర్వహించిన మీట్ ద చాంపియన్ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. సోమవారం అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీనగర్ బ్రాంచ్లో జరిగిన వేడుకలకు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ.. ‘ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని డైట్లో భాగం చేసుకుంటే పౌష్టిక లోపాన్ని అధిగమించవచ్చు. ప్రతి ఒక్కరు వ్యాయమానికి కచ్చితంగా కొంత సమయం కేటాయిస్తేనే ఫిట్ ఇండియా సాధ్యం’ అని పేర్కొంది. జగన్ మాట్లాడుతూ.. నిఖత్ జరీన్ పర్యవేక్షణలో త్వరలో అక్షర విద్యాసంస్థల్లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మదన్మోహన్ రావు, రమణి, నిఖత్ తండ్రి జమీల్, భాస్కర్రావు పాల్గొన్నారు.