ముంబై: న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. రోహిత్, రాహుల్ వంటి వారి గైర్హాజరీలో ఓపెనర్గా బరిలోకి దిగిన మయాంక్.. వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 150, 62 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘మయాంక్ ఆత్మవిశ్వాసానికి చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. మెరుగైన ప్రదర్శనతో అతడేంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్ తరహాలోనే అంతర్జాతీయ మ్యాచ్లోనూ ప్రశాంతంగా ఆడాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్పై చక్కటి షాట్లతో అలరించాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన అజాజ్ పటేల్ బౌలింగ్లో ఎక్స్ట్రా కవర్స్, లాంగాఫ్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్లు ఆకట్టుకున్నాయి. కాన్పూర్ టెస్టులో జెమీసన్ బౌలింగ్లో ఇబ్బంది పడ్డ మయాంక్.. రెండో మ్యాచ్కు వచ్చేసరికి తన బలహీనతలను అధిగమించాడు’అని పేర్కొన్నాడు.