న్యూఢిల్లీ : ఐసీసీ టైటిల్ సాధించాలంటే మానసికంగా సంసిద్ధంగా ఉండాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ సూచించాడు. గత దశాబ్ద కాలంగా ఇండియా ఐసీసీ టైటిల్ సాధించలేకపోవడానికి కారణం మానసికంగా సంసిద్ధంగా లేకపోవడమేనన్నాడు. టీమ్ ఇండియా చివరిసారిగా 2013లో ధోనీ నేతృత్వంలో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
ఆ తరువాత ఐసీసీ టోర్నీల్లో అత్యంత ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోతూనే ఉంది. రెండేళ్ల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్గా సంతృప్తి చెందింది. ఆటలో మెళకువలే కాదు, మానసిక స్థితికూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని హెడెన్ అన్నాడు.