ఇంగ్లండ్తో తొలి టెస్టు డ్రా
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం తడిసి ముద్దయ్యింది. ఆటకు అనువుగా లేకుండా చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క బంతి పడకుండానే ఆట డ్రాగా ముగియడంతో ఇరు జట్లకు చెరో నాలుగు పాయింట్లు కేటాయించారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి రోజు ఆదివారం ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దాదా పు ప్రతిసారి ఇంగ్లండ్లో తొలి టెస్టును కోల్పోతూ వస్తున్నా.. భారత్ ఈ సారి చరిత్ర తిరుగరాద్దామనుకున్నా ఆశలు నెరవేరలేదు. ఈ సిరీస్ ద్వారా రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మన్గా నిలదొక్కుకోగా, బుమ్రా మళ్లీ పాత ఫామ్ పుణికిపుచ్చుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన పేస్కు పదును తగ్గలేదని నిరూపించాడు. జో రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్లు మధ్య గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మొదలవనుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 183, భారత్ తొలి ఇన్నింగ్స్: 278, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 303, భారత్ రెండో ఇన్నింగ్స్: 52/1.