ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. బౌలింగ్ మరినె కాప్ 5 వికెట్లతో సత్తాచాటగా.. బ్యాటింగ్లో యువ ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. కిమ్ గార్త్ (32 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. హర్లీన్ (20), జార్జియా (22) పర్వాలేదనిపించారు.
ఢిల్లీ బౌలర్లలో కాప్ (5/15), శిఖ పాండే (3/26) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (21 నాటౌట్)ను నాన్ స్ట్రయికర్ ఎండ్కు పరిమితం చేస్తూ షఫాలీ విధ్వంసం సృష్టించింది. బంతి ఎక్కడేసినా దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన షఫాలీ.. తనను లేడీ సెహ్వాగ్ ఎందుకంటారో మరోసారి నిరూపించింది.