INDW vs HKGW : ఆసియా కప్ రెండో మ్యాచ్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన(124) దంచేసింది. హాంకాంగ్ చైనా జట్టును బెంబేలెత్తిస్తూ రికార్డు శతకంతో చెలరేగింది మంధాన. మిడిలార్డర్ విఫలమైనా.. ఏమాత్రం జోరు తగ్గించని ఓపెనర్ బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా వైస్ కెప్టెన్ విధ్వంసంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. పసికూన హాంకాంగ్ ముందు దాదాపు అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది హర్మన్ప్రీత్ కౌర్ సేన.
భారత ఓపెనర్ స్మృతి మంధాన(124) మరోసారి తన ప్రతాపం చూపించింది. ఆసియా కప్ రెండో మ్యాచ్లో హాంకాంగ్ చైనా బౌలర్లను హడలెత్తిస్తూ రికార్డు శతకం బాదేసింది. టీ20ల్లో రెండో సెంచరీ కొట్టిన మంధాన అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులతో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందు రెండో స్థానంలో ఉన్న తను.. సూపర్ సెంచరీతో భారత్కే చెందిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మంధాన ఖాతాలో 10,869 పరుగులు ఉన్నాయి.
Innings break!
An extraordinary century from Vice-captain Smriti Mandhana powers #TeamIndia to 193/5 👏👏
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/l2ZXU8kEi7#WomensAsiaCup | #INDvHK pic.twitter.com/IVZMrhKxxM
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
టాస్ ఓడిన భారత జట్టుకు షఫాలీ వర్మ(28)తో కలిసి శుభారంభమిచ్చింది మంధాన. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదగా.. స్కోర్ బోర్డు పరుగులు తీసింది. దంచేస్తున్న షఫాలీని ఔట్ చేయగా.. 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది టీమిండియా. దాంతో.. రెండొందలకుపైగా స్కోర్ ఖాయమనుకున్న వేళ ప్రతీకా రావల్(10), రీచా ఘోష్ (11), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(10)లు.. మరోసారి నిరాశపరిచారు.
సహకరించేవాళ్లు కరువైన మంధాన తన దూకుడు ఆపలేదు. కెరీర్లలో రెండో టీ20 సెంచరీతో జట్టుకు కొండంత స్కోరందించింది. మంధాన మెరుపుల ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులతో హాంకాంగ్ చైనాను భయపెట్టింది టీమిండియా.