కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బుధవారం తన తొలి మ్యాచ్లో సింధు 12-21, 21-10, 15-21 స్కోరుతో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన సింధు తొలి టోర్నీలోనే నిరాశపరిచింది. స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమైన ఈ తెలుగు షట్లర్..మారిన్కు దీటైన పోటీనివ్వలేకపోయింది. మారిన్తో ముఖాముఖి పోరులో సింధు 5-10తో వెనుకంజలో కొనసాగుతున్నది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 22-24, 21-12, 21-18తో లక్ష్యసేన్పై విజయం సాధించి ముందంజ వేశాడు. పురుషుల డబుల్స్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-16, 21-13తో కొరియన్ ద్వయం చొయి సోల్ గ్యు-కిమ్ వోన్ హొపై గెలిచి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్లో మాళవికా బన్సోద్, డబుల్స్లో అశ్వినీ భట్-శిఖా గౌతమ్ ఓటమి చవిచూశారు.