న్యూఢిల్లీ: కరోనా విజృంభణ మధ్య కొనసాగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు ఊహించని షాక్ తగిలింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని రాకెట్ పట్టిన మాళవిక బన్సోద్.. అద్వితీయ ఆటతీరుతో వరుస గేమ్ల్లో సైనా నెహ్వాల్ను ఓడించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మాళవిక 21-17, 21-9తో సైనాపై గెలుపొందింది. 2017 తర్వాత ఓ భారత క్రీడాకారిణి చేతిలో సైనా ఓడటం ఇది రెండోసారి మాత్రమే కాగా.. ఇతర మ్యాచ్ల్లో విజయాలు సాధించిన పీవీ సింధు, అశ్మిత, ఆకర్శి కశ్యప్ క్వార్టర్స్లో అడుగుపెట్టారు. పురుషుల విభాగంలో లక్ష్యసేన్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్కు చేరారు.
ఏడుగురికి కరోనా
ఇండియా ఓపెన్లో కరోనా వైరస్ అందరినీ కలవరపాటుకు గురిచేసింది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతున్న టోర్నీలో గురువారం ఏడుగురు ప్లేయర్లు వైరస్ బారిన పడ్డారు. ఇందులో ప్రపంచ చాంపియన్షిప్ రజత విజేత కిడాంబి శ్రీకాంత్ సహా అశ్విని పొనప్ప, రితికా రాహుల్, త్రిషా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్సింగ్, ఖుషి గుప్తా ఉన్నారు. వీళ్లందరికి పాజిటివ్ అని తేలడంతో టోర్నీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్), భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బీఏఐ) ఒక ప్రకటనలో ధృవీకరించాయి. ఇదిలా ఉంటే యువ షట్లర్ త్రిషా జాలీకి ఇంతకుముందే పాజిటివ్ అని తేలినా.. టోర్నీలో ఆడించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈనెల 8, 10 తేదీల్లో జరిపిన కొవిడ్-19 పరీక్షలో సాయి ప్రణీత్తో పాటు త్రిషకు పాజిటివ్ అని తేలింది.