అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రాత్రంతా సంబురాలు జరుపుకుంది. మ్యాచ్ ముగిసి బహుమతి ప్రదానోత్సవం జరిగే సరికే చాలా ఆలస్యం కాగా.. సోమవారం తెల్లవారే వరకు ధోనీ బృందం వేడుకల్లో మునిగిపోయింది. ముంబై ఇండియన్స్తో సమంగా చెన్నై ఐదో టైటిల్ ఖాతాలో వేసుకోగా.. యావత్ క్రీడాలోకం ధోనీ, సీఎస్కేను అభినందనల్లో ముంచెత్తింది.
ప్రతి సందర్భానికి ధోనీ వద్ద ప్రణాళికలు ఉంటాయని ఒకరంటే.. అతడి చేతిలో మహేంద్రజాలముందని మరొకరు.. పరిస్థితులు ఎంతగా పరీక్షిస్తే మహీ అంతగా రాటుదేలుతాడని ఒకరంటే.. క్రికెట్లో అతడు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అని మరకొరు ఇలా ‘తలా’పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘మహీ భాయ్ నీ కోసమే ఏదైనా’ అంటూ కప్పును ధోనీకి కానుకగా ఇస్తున్నట్లు జడేజా పేర్కొనగా.. అదిరిపోయే రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చినందుకు సహచరులకు అంబటి రాయుడు ధన్యవాదాలు తెలిపాడు. ఏది ఏమైనా.. వచ్చే సీజన్లో ధోనీ ఆడుతాడా అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లభించలేదు.