చెన్నై: ఐపీఎల్ మెగా వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నైలో అడుగుపెట్టాడు. వచ్చే నెల ఆరంభంలో బెంగళూరు వేదికగా వేలం జరుగనుండగా.. గురువారం తల చెన్నైలో దర్శనమిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీని చెన్నై ఫ్రాంచైజీ రూ.12 కోట్లకు రిటైన్ చేసుకోగా.. వేలంలో ఎంపిక చేసుకోవాల్సిన ఆటగాళ్ల గురించే చర్చించేందుకే ధోనీ చెన్నైలో దిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చెన్నై జట్టు ధోనీతో పాటు రవీంద్ర జడేజా (16 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (6 కోట్లు), మోయిన్ అలీ (8 కోట్లు)ని రిటైన్ చేసుకుంది. సీఎస్కే పర్స్లో ఇంకా రూ.58 కోట్లు మిగిలుండగా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. చెన్నైలోనే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నట్లు గతంలోనే లీక్ ఇచ్చిన ధోనీ.. తన ప్రాధాన్యతను తగ్గించుకొని రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగుతుండటం గమనార్హం.