హైదరాబాద్: మాధురి వేణుగోపాల్..! ఈయన టేబుల్ టెన్నిస్ కోచ్. టేబుల్ టెన్నిస్ క్రీడలో చిన్నారి క్రీడాకారులను తీర్చిదిద్దడంలో మాధురి వేణుగోపాల్ది అందెవేసిన చేయి. ఆయన నిర్విరామ కృషి ఫలితంగానే నేడు భారత టేబుల్ టెన్నిస్ చిత్రపటంపై తెలంగాణ ఘనమైన చోటు దక్కించుకుంది. ఈ రోజుల్లో ఏ క్రీడలోనైనా పిల్లలకు కోచింగ్ ఇప్పించాలంటే సామాన్యులకు అంత సులువు కాదు. ఫీజులు భరించలేని స్థాయిలో ఉంటాయి. ఫీజులకు తోడు కిట్, ఇతర పరికరాలు, డైట్ ఖర్చులు తడిసిమోపెడవుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కోచింగ్ సంస్థలు నిస్వార్థంగా, లాభాపేక్ష లేకుండా సామాన్యులు కూడా భరించగల స్కీమ్ల ద్వారా క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాయి. అలాంటి సంస్థల్లో గుజరాతీ సేవా మండల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ కూడా ఒకటి. సికింద్రాబాద్ ఆర్పీరోడ్లోని ఆర్యసమాజ్ మందిర్ పక్కనే ఈ అకాడమీ ఉన్నది. ఇలాంటి సంస్థల్లో నిస్వార్థంగా పిల్లలకు ఆటలు నేర్పే కోచ్లు పనిచేస్తున్నారు. అలాంటి ముగ్గురు కోచ్లు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను గర్వించేలా చేశారు.
తక్కువగా మాట్లాడుతూ ట్రెయినింగ్ కోసం వచ్చిన పిల్లలతో ఎక్కువగా మాట్లాడించడం. దాని ద్వారా వాళ్ల అభిప్రాయాలు, ఆసక్తులను పసిగట్టడం, వాటికి అనుగుణంగా ఎవరికి తగిన రీతిలో వారికి ఆటల్లో తర్ఫీదునివ్వడం ఆ ముగ్గురు కోచ్ల స్పెషాలిటీ. ఇంతకూ ఆ ముగ్గురు కోచ్లు ఎవరంటే.. బాస్కెట్ బాల్ కోచ్ బాన రవీందర్, బ్యాడ్మింటన్ కోచ్ స్వర్గీయ మహబూబ్ అలీ, టేబుల్ టెన్నిస్ కోచ్ మాధురి వేణుగోపాల్. ఈ ముగ్గురు ఎంతో ఓర్పుతో, నేర్పుతో తమ ట్రెయినీలకు తర్ఫీదు నుంచి ఎంతో అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులను తయారు చేశారు.
అయితే, విషాదకరమైన విషయం ఏమిటంటే ఇంత కష్టపడ్డా ఈ ముగ్గురికి ఎలాంటి రివార్డులు కానీ, తగిన గుర్తింపు కానీ దక్కలేదు. వారిలో అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో పనిచేసే బ్యాడ్మింటన్ కోచ్ మహబూబ్ అలీ రిటైర్మెంట్ తర్వాత పేదరికం అనుభవించి మరణించారు. బాన రవీందర్ కూడా ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారంకానీ, గుర్తింపుకానీ పొందలేదు. ఇక మాధురి వేణుగోపాల్ విషయానికి వస్తే.. ఆయన 1991లో సికింద్రాబాద్ వైఎంసీఏలో చేరారు. ఇతరులు ఆడటం చూసి ఆయన ఆట నేర్చుకున్నారు.
ఆటగాళ్ల కదలికలను పరిశీలించడంలో ఆయన చురుగ్గా ఉండేవారు. అందుకే ఆయన గురువు తేలుకుంట నాగరాజ్ యువ క్రీడాకారులను తీర్చిదిద్దే దిశగా మాధురి వేణుగోపాల్ను ప్రోత్సహించారు. గురువు చెప్పినట్లుగానే మూడు దశాబ్దాలుగా టేబుల్ టెన్నిస్లో కోచింగ్ ఇస్తున్న వేణుగోపాల్ ఇప్పటివరకు ఎంతో మంది క్రీడాకారులను తయారుచేశాడు. ఈ క్రమంలోనే ఆయన దగ్గర శిక్షణ పొందిన తెలంగాణ క్రీడాకారిణిలు భవిత నాగులపల్లి, వరుణి జైస్వాల్ 2019లో జమ్ములో జరిగిన సీనియర్స్ నేషనల్ గేమ్స్లో కాంస్య పతకం సాధించారు.
సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు స్లొవేనియా, క్రోయేషియాల్లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఆయన దగ్గర శిక్షణ పొందినవారిలో పాలక్ ఘియా స్టేట్ సబ్ జూనియర్ నెంబర్ 1గా, అనన్య దోనెకల్ స్టేట్ సబ్ జూనియర్ రన్నరప్గా నిలిచారు. 2019లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్ లో సత్య ఆస్పతి స్టేట్ నెంబర్ 3 స్థానం దక్కించుకుంది. ఇక 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వీశన్ గుప్తా బాయ్స్ అండర్ 12 చాంపియన్గా నిలిచాడు.
టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2007లో ఇరాన్లో జరిగిన ఫజ్ర్ ఇంటర్నేషనల్ జూనియర్ అండ్ క్యాడెట్స్ చాంపియన్షిప్స్కు కోచ్గా నియమించింది. 2015లో ఇండోర్లో జరిగిన ఇండియా జూనియర్ ఓపెన్కు జాతీయ కోచ్గా వేణుగోపాల్ నియమితులయ్యారు. 2006 నుంచి 2016 మధ్య ఆయన పర్యవేక్షణలో వివిధ కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 12 కాంస్యాలు, నాలుగు రజతాలు, ఎనిమిది గోల్డ్ మెడల్స్ సాధించారు.