మాజీ చాంపియన్లు నిలకడైన ప్రదర్శన కొనసాగించడంలో విఫల మవుతున్న చోట అరంగేట్ర జట్లు అదరగొడుతున్నాయి. ఐపీఎల్-15వ సీజన్లో ఇప్పటికే 8
విజయాలతో గుజరాత్ అనధికారికంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టగా.. లక్నో కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నది. మొదట కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో మెరుగైన స్కోరు చేసిన లక్నో.. ఆనక మొహసిన్ బంతితో మ్యాజిక్ చేయడంతో ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఈ గెలుపుతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న రాహుల్ సేన.. ప్లే ఆఫ్స్కు చేరువైంది!
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-15వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి పోరులో లక్నో 6 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపొందింది. లక్నోకు వరుసగా ఇది మూడో విజయం కాగా.. ఢిల్లీ ఐదో పరాజయం మూటగట్టుకుంది. ఆడిన పది మ్యాచ్ల్లో ఏడింట నెగ్గిన లక్నో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు దగ్గరైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
కెప్టెన్ లోకేశ్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ రిషబ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, ఒక సిక్సర్), అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. లక్నో యువ పేసర్ మొహసిన్ ఖాన్ (4/16) అదరగొట్టాడు.
ఓపెనర్లు పృథ్వీ షా (5), వార్నర్ (3) విఫలంకాగా.. మిషెల్ మార్ష్ (20 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రావ్మన్ పావెల్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో కుల్దీప్ సేన్ (16 నాటౌట్)తో కలిసి అక్షర్ పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. మొహసిన్ ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం జరుగనున్న మ్యాచ్లో కోల్కతాతో రాజస్థాన్ తలపడనుంది.
పృథ్వీ షాకు జరిమానా
ముంబై: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షాకు జరిమానా పడింది. లెవల్-1 నేరానికి పాల్పడడంతో షాపై చర్యలు తీసుకున్నారు. అతడిని మందలించడంతోపాటు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. లక్నోతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా దిగిన షా ఐదు పరుగులకే ఔటయ్యాడు. ‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు షా అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం మేరకు జరిమానా విధించాం’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 195/3 (కేఎల్ రాహుల్ 77, దీపక్ హుడా 52; శార్దూల్ 3/40), ఢిల్లీ: 20 ఓవర్లలో 189/7 (పంత్ 44, అక్షర్ 42 నాటౌట్; మొహసిన్ ఖాన్ 4/16).