న్యూఢిల్లీ: భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్.. అమెరికాలో జరిగిన హై పర్ఫార్మెన్స్ అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్లో రెండో ఈవెంట్ బరిలోకి దిగిన 24 ఏండ్ల శ్రీశంకర్ 8.29 మీటర్లు లంఘించి పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన శ్రీశంకర్.. తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (8.36 మీటర్లు)కు 0.07 మీటర్లు తక్కువ దూకాడు. చైనాకు చెందిన వైడాంగ్ (7.99 మీటర్లు), హుఫెంగ్ హాంగ్ (7.61 మీటర్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ఈ ప్రదర్శనతో శ్రీశంకర్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అర్హత మార్క్ (8.25 మీటర్లు) అందుకున్నా.. గాలి తీవ్రత కారణంగా దీన్ని మెగాటోర్నీకి పరిగణనలోకి తీసుకోవడం లేదని నిర్వహకులు ప్రకటించారు