IPL: T20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుందో ఎవరూ చెప్పలేరు. ఓడిపోతుంది అనుకున్న టీం గెలవచ్చు.. గెలుస్తుంది అనుకున్న టీం ఓడిపోవచ్చు. IPLలో చివరి బంతి వరకు వచ్చి విజయాలు తారుమారు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయి గెలిచిన సందర్భాలు అరుదు.
రాజస్థాన్ రాయల్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా రాజస్థాన్, హైదరాబాద్ తలపడిన మ్యాచ్లో విజయం రెండు టీంల మధ్య దోబూచులాడింది. ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బట్లర్, శాంసన్ రాణించడంతో 215 పరుగులు చేయగలిగింది. లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ విజయం సాధించాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు చేయాలి. సందీప్ శర్మ బౌలింగ్లో అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్ మొదటి 5 బంతుల్లో 12 చేశారు. చివరి బంతికి 5 పరుగులు రావాల్సి ఉండగా సమద్ చివరి బంతికి లాంగాఫ్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ చివరి బంతిని సందీప్ శర్మ నోబాల్గా వేయడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. సమీకరణం చివరి బంతికి 4 పరుగులు. కానీ అబ్దుల్ సమద్ అద్భుతం చేశాడు. చివరి బంతికి సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ విజయం సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 6వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై తలపడిన మ్యాచ్లో చివరి బంతి నో బాల్ కావడంతో విజయం బెంగళూరు నుంచి చెన్నైకి మారింది. ఏబీ డివిలర్స్, కోహ్లీ రాణించడంతో మొదట బెంగళూరు 165 పరుగులు చేయగలిగింది. లక్ష్య చేధనకు దిగిన చెన్నై విజయం సాధించాలంటే చివరి ఓవర్ ఓవర్లో 16 పరుగులు కొట్టాలి. ఆర్పీ సింగ్ బౌలర్. రవీంద్ర జడేజా మొదటి రెండు బంతుల్లో 10 రన్స్ సాధించడంతో చెన్నై విజయం ఖాయమనుకున్నారంత. కానీ ఆ తర్వాత బౌండరీలు రాలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో ఉన్న జడేజా థర్డ్ మ్యాన్లో ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి ఔటవడంతో బెంగళూరు సంబరాల్లో మునిపోయింది. కానీ ఆ బంతిని ఎంపైర్ నో బాల్గా ప్రకటించారు. అయితే అప్పటికే ఒక రన్ తీయడంతో విజయం చెన్నై సొంతమైంది.