బతుమి(జార్జియా) : ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్ దివ్యదేశ్ముఖ్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో హంపి 5-3 తేడాతో చైనా చెందిన టింగ్జి లీపై అద్భుత విజయం సాధించింది. తొలి రెండు గేములు స్కోర్లు సమం కావడంతో పోరు టైబ్రేక్కు దారితీసింది. మొత్తం ఎనిమిది రౌండ్లలో రౌండ్ రౌండ్కు ఆధిక్యం చేతులు మారుకుంటూ వచ్చింది. ర్యాపిడ్ స్టయిల్లో తొలి రెండు టైబ్రేక్లు డ్రా కావడంతో ఇద్దరి ప్లేయర్ల స్కోర్లు 2-2తో సమైంది.
అయితే మూడో ర్యాపిడ్ రౌండ్లో హంపి తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న టింగ్జి విజయం సాధించడంతో స్కోరు 3-2కు చేరుకుంది. వెంటనే పుంజుకున్న హంపి నాలుగో రౌండ్లో తెల్లపావులతో..చైనా ప్లేయర్కు చెక్ పెట్టడంతో స్కోరు 3-3కు చేరుకుంది. అటు తర్వాత జరిగిన రెండు బ్లిట్జ్ గేముల్లో హంపినే విజయం వరించింది. తొలి గేమ్లో తెల్లపావులతో టింగ్జి భరతం పట్టిన హంపి ఆధిక్యాన్ని 4-3కు పెంచుకుంది. అదే దూకుడుతో ఆఖరిదైన రెండో గేమ్లో నల్లపావులతో చైనా ప్లేయర్ను ఓడించడంతో హంపి గెలుపు ఖరారైంది. శనివారం నుంచి టోర్నీ ఫైనల్ పోరు మొదలుకానుంది. ఫైనల్కు క్వాలిఫై అవడంతో క్యాండిడేట్స్ టోర్నీకి హంపి అర్హత సాధించింది. మూడో స్థానం కోసం జరిగే వర్గీకరణ పోరులో చైనా ప్లేయర్లు టింగ్జి లీ, టాన్ జాంగ్జి తలపడనున్నారు.