సుడిగాలి ఇన్నింగ్స్తో విజృంభించిన కమిన్స్
14 బంతుల్లో అర్ధసెంచరీ
పుణెలో కమిన్స్ తుఫాన్ ప్రళయం సృష్టించింది! కనికరం లేకుండా ముంబై ఇండియన్స్ను ఊచకోత కోసింది. గెలుపు తమదే అనుకున్న రోహిత్సేన ఆశలపై నీళ్లు గుమ్మరిస్తూ కమిన్స్ విధ్వంసం రచించాడు. పాకిస్థాన్ నుంచి నేరుగా పుణెలో అడుగుపెట్టిన కమిన్స్..ముంబై పాలిట సింహస్వప్నంలా నిలిచాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతి నుంచే బ్యాటు ఝులిపించిన ఈ కేకేఆర్ పేసర్ సుడిగాలి ఇన్నింగ్స్తో పరుగుల వరద పారించాడు. 14 బంతుల్లో ధనాధన్ అర్ధసెంచరీ కొట్టి ఐపీఎల్లో వేగవంతమైన రికార్డును సమం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ జతగా ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించిన కమిన్స్ ..మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే కోల్కతాను గెలుపు సంబురాల్లో ముంచాడు.
పుణె: ఐపీఎల్లో అభిమానులకు అసలైన మజా దొరికింది. ఇప్పటివరకు ఒకింత చప్పగా సాగుతున్న లీగ్లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మ్యాచ్ పసందైన విందు అందించింది. ఆఖరి వరకు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ముంబైపై కోల్కతాదే పైచేయి అయ్యింది. ఐదుసార్లు చాంపియన్ ముంబైని కోల్కతా మట్టికరిపించింది. బుధవారం ఎమ్సీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఐదు వికెట్ల తేడాతో(24 బంతులు మిగిలుండగానే) ముంబైపై ఘన విజయం సాధించింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలతో కోల్కతా(6) టాప్గేర్లో దూసుకెళ్తుంటే…హ్యాట్రిక్ ఓటములతో ముంబై బోణీ కోసం ఎదురుచూస్తున్నది. తొలుత సూర్యకుమార్ యాదవ్(52), తిలక్వర్మ(38 నాటౌట్) రాణింపుతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 161/4 స్కోరు చేసింది. ప్యాట్ కమిన్స్(2/49) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా..కమిన్స్(15 బంతుల్లో 56 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్స్లు), వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 50 నాటౌట్, 6ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో 16 ఓవర్లలో 162/5 స్కోరు చేసింది. మిల్స్(2/38), అశ్విన్(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు. ధనాధన్ అర్ధసెంచరీతో కోల్కతాకు అదిరిపోయే విజయాన్ని కట్టబెట్టిన కమిన్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
కమిన్స్ పరుగుల హోరు:
162 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన కోల్కతాకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రహానే(7) మరోమారు నిరాశపర్చుగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(10), బిల్లింగ్స్(17), నితీశ్రానా(8), రస్సెల్(11) ఇలా వచ్చి అలా పోయారు. అయితే గెలుపుపై ఆశలు మిణుకుమిణుకు అంటున్న వేళ అయ్యర్, కమిన్స్ అద్భుతం చేశారు. రస్సెల్ నిష్క్రమణ తర్వాత క్రీజులో అడుగుపెట్టిన కమిన్స్ కొట్టిన కొట్టుడుకు స్టేడియం హోరెత్తిపోయింది. తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ సిక్సర్గా మలిచిన ఈ స్టార్ పేసర్ వెనుదిరిగి చూసుకోలేదు. మరుసటి బంతికే ఫోర్ కొట్టి తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. దీంతో సమీకరణం కాస్తా 36 బంతుల్లో 47కు చేరుకుంది. బుమ్రా వేసిన 15వ ఓవర్లో సిక్స్, ఫోర్తో కమిన్స్ 12 పరుగులు ఖాతాలో వేసుకోవడంతో 30 బంతుల్లో 35 పరుగులకు చేరింది. క్రీజులో అప్పటికే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న వెంకటేశ్కు ఏమాత్రం అవకాశమివ్వకుండా ముంబై పేసర్ సామ్స్పై కమిన్స్ నిర్దాక్షిణ్యాంగా విరుచుకుపడ్డాడు. సామ్స్ తొలి బంతిని సిక్స్ కొట్టిన ఈ స్పీడ్స్టర్ వరుస బంతుల్లో 4, 6, 6, 3(2 పరుగులు, నోబాల్), 4, 6 వీర బాదుడు బాదాడు. బౌండరీలే లక్ష్యంగా కమిన్స్ చెలరేగిన తీరుకు ముంబై కెప్టెన్ రోహిత్శర్మ నిశ్చేష్టుడయ్యాడు. ఈ క్రమంలో 2018లో ఢిల్లీ డేర్డెవిల్స్పై కేఎల్ రాహుల్నెలకొల్పిన వేగవంతమైన అర్ధసెంచరీ (14 బంతుల్లో) రికార్డును కమిన్స్ తాజాగా సమం చేశాడు.
ముంబై పడుతూ లేస్తూ:
తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇన్నింగ్స్ ఒడిదొడుకుల పయనంగా సాగింది. ఓపెనర్లు రోహిత్శర్మ(3), ఇషాన్ కిషన్(14) ఘోరంగా నిరాశపరిచారు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సూర్యకుమార్ యాదవ్(52), తిలక్వర్మ(38 నాటౌట్), బ్రెవిస్(29) బ్యాట్లు ఝులిపించడంతో ముంబైకి పోరాడే స్కోరు దక్కింది. ఆఖర్లో పొలార్డ్(5 బంతుల్లో 22, 3 సిక్స్లు) దూకుడుతో చెలరేగాడు.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 161/4(సూర్యకుమార్ 52, తిలక్వర్మ 38 నాటౌట్, కమిన్స్ 2/49, ఉమేశ్ యాదవ్ 1/25), కోల్కతా: 16 ఓవర్లలో 162/5(కమిన్స్ 56 నాటౌట్, వెంకటేశ్ 50 నాటౌట్, మిల్స్ 2/38, అశ్విన్ 2/25)