రవీంద్రభారతి, జూలై 10 : తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా సాగుతున్న సురభి నాటకోత్సవాలు శనివారం ముగిశాయి. దీనికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ సురభి నాటకాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి సురభి కళాకారులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, అలాంటి వారిచే బాద్మి శివకుమార్ నాలుగురోజులుగా నాటకాలను ప్రదర్శింపజేయడం ఎంతో అభినందనీయమన్నారు. సురభి నాటక రక్షణ కోసం ఏడాదికి సంగీత అకాడమీ ద్వారా 20 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. సంగీత నాటక అకాడమీ సెక్రటరీ వసుంధర, సారపల్లి కొండల్రావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస కల్యాణ పౌరాణిక నాటక ప్రదర్శన నిర్వహించారు. సారపల్లి కొండల్రావు కళాకారులకు నగదు అందజేశారు.